ఈ ప్రాంతాలను కలుపుతూ రాజధాని అమరావతికి రైల్వే లైన్..
విజయవాడ - గుంటూరు నగరాల్ని అమరావతితో అనుసంధానించే రైల్వే లైన్ ఎట్టకేలకు కదిలింది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకూ 56 కిలో మీటర్ల కొత్త లైన్ ఏర్పాటుకు రైల్వేశాఖ సిద్ధమైంది. భూసేకరణకు నోటిఫికేషన్ కూడా ఇచ్చింది.
విజయవాడ-హైదరాబాద్ లైన్లో ఎర్రుపాలెం వద్ద కొత్త లైన్ మొదలై అమరావతి మీదుగా గుంటూరు-విజయవాడ లైన్లోని నంబూరు వద్ద కలుస్తుంది. ఎర్రుపాలెం తర్వాత పెద్దాపురం, చిన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరులలో మొత్తం 9 స్టేషన్లు నిర్మిస్తారు. వీటిలో పెద్దాపురం, పరిటాల, అమరావతి, కొప్పురావూరు పెద్ద స్టేషన్లు. వీటిలోనూ అమరావతి ప్రధాన స్టేషన్గా ఉంటుంది. ఈ లైన్లో భాగంగా కృష్ణానదిపై కొత్తపేట-వడ్డమాను మధ్య 3 కిలోమీటర్ల వంతెన నిర్మిస్తారు.
అమరావతిని త్వరితగతన పూర్తిచేసేలా సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రారంభ సమయంలో అనేక ప్రాజెక్టులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఆయా ప్రాజెక్టులను తిరిగి గాడినపెట్టేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటుంది.
గత టీడీపీ ప్రభుత్వంలో అమరావతి రైల్వేలైన్ కోసం ప్రణాళికలు రూపొందించారు. ఇప్పుడు ఈ రైల్వే లైన్కు భూసేకరణ కోసం రైల్వే శాఖ ఆగమేఘాల మీద చర్యలు చేపట్టింది. గత టిడిపి ప్రభుత్వంలోని అమరావతి అభివృద్ధిలో భాగంగా ఈ రైల్వే లైను నిర్మించాలని నిర్ణయించారు.
అయితే ఈ రైల్వే లైన్ కోసం భూసేకరణకు ప్రభుత్వం నుంచి కొంత మొత్తంలో భూమిని ఇవ్వాల్సి ఉంది. దీంతో గత ప్రభుత్వం ఏదో ఒక కారణం చెప్పి నిధుల విషయంలో ముందుకు రాలేదని అక్కడి స్థానికులు చర్చించుకుంటున్నారు. తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే రైల్వే శాఖ ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రిపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 56.53 కి.మీ కొత్త లైన్ వేసేందుకు అడుగులు ముందుకుపడ్డాయి. ప్రాజెక్టులో కీలకమైన భూసేకరణకు రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
అమరావతి రైల్వే లైన్ అనుసంధానం ఇలా..
గత టిడిపి ప్రభుత్వంలో రాజధాని అమరావతిని ఓవైపు విజయవాడ.. మరోవైపు గుంటూరు రైల్వే లైన్లకు అనుసంధానం చేశారు. అయితే తాజాగా అమరావతి రైల్వే ప్రాజెక్టును ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు మధ్య 56.53 కి.మీ మేర డబుల్ లైను, అమరావతి – పెదకూరపాడు మధ్య 24.5 కి.మీ మేర సింగిల్ లైన్, సత్తెనపల్లి – నరసరావుపేట మధ్య 25 కి.మీ సింగిల్ లైన్ కలిపి మొత్తం 106 కి.మీ మేర కొత్త లైనుకు ఆమోదం పడింది. అయితే గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆరేళ్ల పాటు ఎలాంటి కదలిక లేదు. తాజాగా ప్రభుత్వం మారిన తర్వాత పనుల్లో వేగం ఊపందుకుంది.