AP-Mission-Vatsalya-423-jobs-in-ap-details-2023

 AP-Mission-Vatsalya-423-jobs-in-ap-details-2023

AP Mission Vatsalya : ఏపీలో 423 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌.. త్వరలోనే నోటిఫికేషన్‌

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన మిషన్‌ వాత్సల్య (AP Mission Vatsalya) అమలుకు కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాల పరిధిలో 423 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా బాలల రక్షణ యూనిట్‌, స్పెషలైజ్డ్‌ అడాప్షన్‌ ఏజెన్సీలు, బాలల సంరక్షణ కమిటీ, జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు, బాలల గృహాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో 311 పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో, 15 పోస్టులను తాత్కాలిక విధానంలో, మరో 97 పోస్టులను అవుట్ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయనున్నట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అయితే.. ఇప్పటికే ఏపీలో అంగన్‌వాడీ, డీఎమ్‌హెచ్‌వో, పోలీస్‌ కానిస్టేబుల్, ఎస్‌ఐ, బ్యాక్‌లాగ్‌, స్టాప్‌నర్స్‌, ఏపీపీఎస్సీ గ్రూప్‌ -1.. వంటి పలు ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మిషన్‌ వాత్సల్యలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనున్నారు.

అసలేంటీ ఈ మిషన్‌ వాత్సల్య..?
ఏపీలో అనాథ బాలల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలువనున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయిన, నిరాదరణకు గురైన, నిరాశ్రయులైన 18 ఏళ్లలోపు అనాథ పిల్లలకు మిషన్‌ వాత్సల్య కింద నెలకు రూ.4 వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. అర్హులైన వారు ఏప్రిల్‌ 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అనాథ పిల్లలు వాత్సల్య పథకం కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సీడీపీవోలు, సూపర్‌వైజర్లకు అర్హులైన పిల్లల దరఖాస్తులకు సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. కలెక్టర్‌ చైర్‌ పర్సన్‌గా జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారి, సీడబ్ల్యూసీ అధికారి, డీసీపీఓ, ఎన్‌ఐసీ పీఓ, శిశు గృహ సంక్షేమాధికారి, ఒక ఎన్జీఓ అధికారి, సభ్యుల పర్యవేక్షణలో అర్హుల ఎంపిక ఉంటుంది. అర్హులు సంబంధిత గ్రామ, వార్డు సరివాలయ పరిధిలోని మహిళా పోలీసులను కలిసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

నిరుపేద నిస్సహాయ స్థితిలో 18 ఏళ్లలోపు వారు పిల్లలు అర్హులు.. వారికి నెలకు రూ.4 వేల చొప్పున సాయం అందిస్తారు. వితంతు, విడాకులు తీసుకున్న తల్లీ పిల్లలు.. తల్లిదండ్రులు కోల్పోయి ఇతర కుటుంబాల్లో నివసిస్తున్న అనాథ పిల్లలు.. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు అర్హులు. అలాగే పిల్లలను పెంచలేని స్థితిలో ఉన్న వారి బాలలు.. బాల కార్మికులు, బాల్య వివాహాల అక్రమ రవాణాకు గురైన వారు హెచ్‌ఐవీ బాధితుల పిల్లలు అర్హులు.

అలాగే.. వికలాంగులు, తప్పిపోయిన, వీధుల్లో నివసిస్తున్న పిల్లలు, పారిపోయిన పిల్లలు, యాచకుల పిల్లలు.. హింసకు, దోపిడీకి గురైన పిల్లలు, అనాథ ఆశ్రమాల్లో ఉన్న బాలలు, పీఎంకేర్‌ ఫర్‌ చిల్డ్రన్‌ పథకం పొందుతున్న చిన్నారులు అర్హులు. వీళ్ల కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 96 వేలు మించకూడదు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మిషన్‌ వాత్సల్య పథకంలో భాగంగా.. బాలల రక్షణ విభాగం ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 60:40 నిష్పత్తిలో నిధులు ఇస్తారు. అంటే కేంద్రం రూ.2,400 అందజేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రూ.1600 ఇస్తోంది. సంరక్షణ లేని పిల్లలు.. ఆదరణ అవసరమైన పిల్లలు.. వారి తల్లిదండ్రుల రక్త సంబంధీకులు సంరక్షకులతో ఉంటూ విద్యను కొనసాగించేందుకు స్పాన్సర్‌షిప్‌గా ఈ నగదును అందజేస్తున్నారు.